‘ఆడసింహం’ దుర్గాబాయి దేశ్‌ముఖ్

ఉప్పు సత్యాగ్రహంలో ఆమె పోలీసుల లాటిచార్జి లో తీవ్రంగా గాయపడ్డారు, రక్తం కారుతున్నా ఉప్పు జారవిడవలేదు. అందుకే అప్పటి బ్రిటీష్ అధికారులు ఆమెను ఆడసింహం గా అభివర్ణించారు.

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు.

  • 1909లో కాకినాదలో జన్మించిన దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది.
  • తెలుగుగడ్డ పై గాంధీజీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.
  • 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రుజీ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది.
  • మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది.
  • సంఘ సంస్కర్తగా బాల్య వివాహము, వరకట్నం వంటి దురాచారాలపై పోరాడింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది.
  • ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.
  • ఆమె భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్‌ కమీషన్‌ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటుగా పనిచేశారు.
  • భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. ఆ సందర్భములో సి.డి. దేశముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది.
  • 1971లో ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికి నెహ్రూ లిటరరీ అవార్డును, యునెస్కో బహుమతిని అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌తో సత్కరించింది